NIRMAL PURJA - JOHN SNORRI - ALI SADPARA - JUAN PABLO
ఈ మధ్య ఒక డాక్యుమెంటరీకి సబ్టైటిల్స్ రాశాను. 2021లో K2 వింటర్ సమ్మిట్ డిజాస్టర్లో జాన్ స్నోరి, అలీ సద్పారా, వాన్ పాబ్లో అనే ముగ్గురు పర్వతారోహకులు చనిపోవడం గురించిన డాక్యుమెంటరీ అది. చాలా రోజులు వెంటాడిన డాక్యుమెంటరీ(లాస్ట్ మంత్ అంతర్గంగ దగ్గర ఒక చిన్న గుట్ట ఎక్కినప్పుడు దీని గురించి చాలా సేపు మాట్లాడుకున్నాం.) K2 వింటర్ సమ్మిట్కు ముందు జాన్ స్నోరిని ఒక ఐస్లాండ్ జర్నలిస్టు ఇంటర్వ్యూ చేస్తూ ఒక ప్రశ్న అడుగుతాడు. ఇలాంటి యాత్రకి వెళ్లేటప్పుడు చావు గురించి ఆలోచిస్తారా? అని. దానికి సమాధానంగా... "ఇలాంటి యాత్రలకు వెళ్లినప్పుడు చావు మనతో కలిసే ఉంటుంది. మనం దానికి ఎదురుతిరిగి నిలబడగలగాలి... ఆ క్షణంలో కాస్త గర్వంగా ఉంటుంది." అంటాడు స్నోరి. అదే ఇంటర్వ్యూలో స్నోరి భార్య ఒక మాట అంటుంది. "శిఖరాన్ని చేరుకున్నాక వచ్చే థ్రిల్, పర్వతారోహకులకు వ్యసనంగా మారుతుంది" అని.పాకిస్తాన్కు చెందిన అలీ సద్పారా, సాజిద్ సద్పారా(అలీ కుమారుడు)ని గైడ్లుగా తీసుకుని సమ్మిట్కు వెళ్తాడు స్నోరి. అప్పటివరకు K2ని వింటర్లో ఎవరూ ఎక్కలేదు. 8,000 మీటర్ల కంటే ఎత్తయిన 14 పర్వతాల్లో... అత్యంత ప్రమాదకరమైన పర్వతం K2. దాన్ని వేసవిలో ఎక్కడమే కష్టం అంటారు పర్వతారోహకులు. అలాంటిది వింటర్లో ఎక్కాలని వెళ్లారు వీళ్లు. అది కరోనా సీజన్ కావడంతో సెవెన్ సమ్మిట్ ట్రెక్స్ లాంటి మౌంటనీరింగ్ కంపెనీల వ్యాపారాలు దాదాపు మూతబడే పరిస్థితి. స్నోరి అనౌన్స్మెంట్ చూసి సెవెన్ సమ్మిట్ ట్రెక్స్కు బిజినెస్ ఐడియా వచ్చింది. తాము కూడా K2 వింటర్ ప్లాన్ చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో కుప్పలుతెప్పలుగా ఔత్సాహికులు పాకిస్తాన్ చేరారు. ఏనాడూ పర్వతాల ముఖం చూడనివాళ్లు కూడా వీళ్లలో ఉన్నారు.
ఏదైనా పర్వతారోహణని క్యాంపులుగా విడగొట్టుకుంటారు మౌంటెనీర్స్. బేస్ క్యాంప్, ఫస్ట్ క్యాంప్, సెకండ్ క్యాంప్, థర్డ్ క్యాంప్, సమ్మిట్. పర్వతం మొదట్లో వేసుకునేది బేస్ క్యాంప్ అయితే కొంత ఎత్తు ఎక్కాక ఫస్ట్ క్యాంప్ వేసుకుంటారు. అక్కడికి అవసరమైన సామగ్రిని అంతా మోసుకెళ్తారు. ముఖ్యంగా సమ్మిట్కు అవసరమైన రోప్స్. ఫస్ట్ క్యాంప్లో అక్కడి వాతావరణానికి అలవాటు పడే వరకు ఉండి, మళ్లీ కిందకొస్తారు. కొంత గ్యాప్ తీసుకుని ఈసారి రెండో క్యాంప్ వరకు వెళ్తారు. సామగ్రిని అక్కడికి మార్చుకుంటారు. మళ్లీ కిందకొస్తారు. ఈసారి థర్డ్ క్యాంప్ వరకు వెళ్తారు. అక్కడే రెస్ట్ తీసుకుని సమ్మిట్కు వెళ్తారు. K2ని అలా మూడు క్యాంపులుగా విభజించుకుంది స్నోరి, సద్పారా టీమ్. వాళ్లు రెండో క్యాంప్ వరకు సామగ్రిని చేర్చుకుని కిందకొచ్చేసరికి... బేస్ క్యాంప్ అంతా జంతర్ మంతర్ అయిపోయింది. గుంపులు గుంపులుగా జనం వచ్చారు. అందులో నిర్మల్ పూర్జా అలియాస్ నిమ్స్డాయ్ టీమ్ కూడా ఉంది. దీంతో స్నోరి, సద్పారా టీమ్లో నిరాశ మొదలవుతుంది. తామేదో వింటర్లో ఫస్ట్ టైమ్ K2ని అధిరోహించిన రికార్డ్ కొట్టాలని వస్తే... వీళ్లంతా వచ్చి పరిస్థితి మార్చేశారనే బాధ కలుగుతుంది. చివరకు అంతా కలిసి పర్వతాన్ని అధిరోహించాలని నిర్ణయించుకుంటారు. అయితే నిర్మల్ పూర్జా మాత్రం తన నేపాలీ టీమ్తో రహస్యంగా మీటింగ్ పెట్టుకుంటాడు.
మౌంటెనీరింగ్లో నిర్మల్ పూర్జా ఒక సంచలనం. బ్రిటీష్ ఆర్మీలో గూర్ఖా బ్రిగేడ్లో 'కోల్డ్ వెదర్ వార్ఫేర్ స్పెషలిస్ట్'గా పనిచేసిన పూర్జా... 2014లో తొలిసారి ఎయిట్ థౌజండర్ సమ్మిట్ చేశాడు. ధవళగిరి పర్వతాన్ని అత్యంత వేగంగా ఎక్కి చూపించాడు. 2016లో ఎవరెస్ట్ ఎక్కాడు. 2018లో ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిగా పర్వతారోహణకి అంకితం అయ్యాడు. అప్పటివరకు 14 ఎయిట్ థౌజండర్స్ని అత్యంత వేగంగా ఎక్కిన రికార్డ్, కొరియన్ క్లైంబర్ కిమ్చాంగ్ హో పేరుతో ఉంటంది. 7 సంవత్సరాలా 310 రోజుల్లో ఆయన ఆ ఫీట్ సాధించాడు. అయితే 7 నెలల్లో 14 పర్వతాల్ని ఎక్కుతానని, చెప్పి మరీ చేసి చూపించాడు పూర్జా. దానికోసం నిమ్స్డాయ్ అవలంభించిన పద్ధతులపై విమర్శలున్నాయి. బేస్ క్యాంప్ టు బేస్ క్యాంప్ హెలికాప్టర్లలో వెళ్లడం లాంటి అంశాల్ని చాలామంది వ్యతిరేకించినా... నిర్మల్ పూర్జా సాధించిన రికార్డుల్ని తక్కువ చేసి చూడలేము.
K2 వింటర్ విషయానికొస్తే నిర్మల్ పూర్జా టార్గెట్లో క్లారిటీ ఉంది. అదేంటి అంటే... షేర్పాల సాయం లేకుండా ఈ పాశ్చాత్యుడు ఎయిట్ థౌజండర్ సమ్మిట్ చేసిందే లేదు. కానీ ఎక్కిన ఘనత మాత్రం పాశ్చాత్యులకే దక్కుతోంది. నేపాలీల కష్టానికి ఒక్కటైనా "ఫస్ట్ ఇన్ హిస్టరీ" గుర్తింపు ఉండాలి. అది K2 వింటర్ కావాలి. ఈ పర్వతంపై నేపాలీ షేర్పాల పేరు నిలిచిపోవాలి. నేపాలీల కంటే ముందు ఇంకెవరైనా పైకి ఎక్కాలని చూస్తే... "వాళ్ల తాళ్లు కట్ చేస్తాను" అంటాడు. రహస్య మీటింగ్లో ఇదే చెప్తాడు నిమ్స్డాయ్. అయితే స్నోరి, సద్పారా టీమ్ ఆల్రెడీ 700 మీటర్ల రోప్ని సెకండ్ క్యాంప్ వరకు చేర్చి ఉన్నారు కాబట్టి వాళ్లతో కలిసి వెళ్లాలని నేపాలీ టీమ్ ఒక నిర్ణయానికి వస్తుంది. స్నోరి, సద్పారా ఒప్పుకుంటారు. అయితే ఎవరికీ చెప్పకుండానే ఒకరోజు నిర్మల్ పూర్జా టీమ్ సమ్మిట్ పూర్తి చేసి తిరిగొస్తుంది. అంతా షాక్. పాకిస్తాన్ ఆర్మీ వచ్చి వాళ్లని సన్మానిస్తుంది. సన్మానించిన వాళ్లు ఊరికే పోకుండా... "మీరు ఎక్కారు సరే, మా అలీ సద్పారా టీమ్ ఇక్కడికి వచ్చి నెల దాటింది. వాళ్లు ఇంకా ఎందుకు ఎక్కలేదు?" అని గెలికి పోతారు. దాంతో స్నోరి, సద్పారాల ఈగో హర్ట్ అవుతుంది. అదే సమయంలో ఎలియా సైకలి అనే ఫిల్మ్మేకర్ వచ్చి, అలీ సద్పారా గొప్పతనంపై డాక్యుమెంటరీ తీస్తానని చెప్పడంతో... తనలో కసి పెరుగుతుంది. కొన్ని సందర్భాల్ల్లో దీన్ని కీర్తి కాంక్ష అని కూడా అనుకోవాలి.
నిర్మల్ పూర్జా టీమ్ విజయాన్ని బేస్ క్యాంప్ దగ్గర సెలబ్రేట్ చేసుకునే సమయంలోనే... సెకండ్ క్యాంప్ నుంచి కిందకు దిగొస్తూ సెర్జీ మింగోటే అనే పర్వతారోహకుడు... అంత ఎత్తు నుంచి కిందకు పడి చనిపోతాడు. దాంతో బేస్ క్యాంప్ దాదాపు సగానికి పైగా ఖాళీ అయిపోతుంది. స్నోరి, సద్పారా టీమ్ మరో వెదర్ విండో కోసం ఆగుతారు. అనుకూల వాతావరణానికి సంబంధించిన రిపోర్ట్ రాగానే ఫైనల్ సమ్మిట్కు సిద్ధమవుతారు. సెవన్ సమ్మిట్ ట్రెక్స్తో వచ్చిన వాళ్లు కూడా వీళ్లతో బయలుదేరుతారు.
పర్వతారోహణలో అత్యంత కీలకమైంది టైమింగ్. ఫస్ట్ క్యాంప్ వరకు ఇన్ని గంటల్లో చేరుకోవాలి, సెకండ్ క్యాంప్కు ఇన్ని గంటలు, థర్డ్ క్యాంప్కు ఇన్ని గంటలు, సమ్మిట్కు ఇంత సమయం... ఇలా ప్రతిదీ టైమింగ్లోపు పూర్తవ్వాలి. ఎక్కడైనా టైమింగ్ మిస్ అయిందా, అన్నీ మూసుకుని వెనక్కి వెళ్లిపోవాలి. ముందుకుపోతే మాత్రం... కాలం ఎంత కర్కశమైంది అనేది తెలుస్తుంది. K2 వింటర్ని డిజాస్టర్ చేసింది ఆ కాలమే. కాకపోతే తప్పు ఒకరు చేస్తే... ఫలితం ఇంకొకరు అనుభవించారు.
ఫిబ్రవరి 4, 2021లో స్నోరి, సద్పారా టీమ్ K2 వింటర్ ఫైనల్ సమ్మిట్ మొదలుపెడతారు. వాళ్లతో వాన్ పాబ్లో(JP) - తమారా లాంగర్ టీమ్, సెవెన్ సమ్మిట్ ట్రెక్స్ టీమ్ కూడా బయలుదేరుతారు. స్నోరి, అలీ సద్పారా, సాజిద్ సద్పారా... థర్డ్ క్యాంప్ చేరుకుని టెంట్ వేసుకుంటాడు. వాన్ పాబ్లో, తమారా లాంగర్ కూడా చేరుకుంటారు. కొలిన్ అనే మరో యువ క్లైంబర్ కూడా పైకి చేరుకుని టెంట్ వేసుకుంటాడు. గడువు ముగిసిపోవడంతో మిగిలినవాళ్లంతా వెనక్కి వెళ్లిపోయుంటారు అనుకుంటారు. కానీ రాత్రి గడిచేకొద్ది వచ్చేవాళ్లు వస్తూనే ఉంటారు. కానీ థర్డ్ క్యాంప్లో టెంట్లు ఉండవు. ప్రతి ఒక్కరూ తమ టెంట్ ఇంకొకరు తెస్తున్నారులే అన్న భ్రమలో ఉంటారు. చివరకు టెంట్లు లేకుండా పైకి వస్తారు. సెవెన్ సమ్మిట్ ట్రెక్స్ మాత్రం... ఎవరూ గడువు లోపల థర్డ్ క్యాంప్ వరకు చేరుకోరులే అన్న ఉద్దేశ్యంతో సరిపడా టెంట్లు పంపించదు. ఒకవేళ అందరూ నిర్ణీత సమయంలోనే థర్డ్ క్యాంప్ వరకు చేరుకుంటే ఏంటి పరిస్థితి? ఈ ప్రశ్నకు సెవెన్ సమ్మిట్ ట్రెక్స్ దగ్గర సమాధానం ఉండదు.
చివరకు ఉన్న మూడు టెంట్లలోనే అంతా సర్దుకుంటారు. ఎవరికీ రెస్ట్ దొరకదు. మరుసటి పొద్దుటికి అంతా తీవ్రంగా అలసిపోయి కనిపిస్తారు. ఈ సందర్భంలో కొలిన్ స్పష్టంగా నిర్ణయించుకుంటాడు... పర్వతారోహణకు సంబంధించి తాను పెట్టుకున్న 10 అంశాల్లో 9 అనుకూలంగా లేవు. దీంతో కిందకు వెళ్లిపోవాలి అనుకుంటాడు. చివరకు జాన్ స్నోరి, అలీ సద్పారా, సాజిద్ సద్పారా, వాన్ పాబ్లో మాత్రమే ఫైనల్ సమ్మిట్కు వెళ్తారు. మిగిలిన అంతా కిందకు వెళ్లిపోతారు. అలా వెళ్తుండగా ఆటనస్ స్కటోవ్ అనే క్లైంబర్... దాదాపు 2,000 మీటర్ల ఎత్తు నుంచి కిందకు పడి చనిపోతాడు. అందరూ కిందకు దిగేసరికి మరో వార్త. స్నోరి, అలీ సద్పారా, వాన్ పాబ్లో ఇంకా సమ్మిట్ పూర్తి చేయలేదని, వాళ్లు ఏమయ్యారో తెలియడం లేదని. ఆక్సిజన్ రెగ్యులేటర్ పనిచేయక సాజిద్ సద్పారా, బాటిల్నెక్ దగ్గర్నించి వెనక్కి వచ్చి థర్డ్ క్యాంపులో ఎదురుచూస్తూ కూర్చుంటాడు. గంటలు గడిచినా పైకి వెళ్లిన ముగ్గురూ తిరిగి వస్తున్న జాడ లేదు. రెస్క్యూ టీమ్ వచ్చి వెతికిచూసింది. అప్పటికే సాజిద్కు అర్ధమైంది. వాళ్లు ఇక రారని... లేరని.
నాలుగు నెలల తర్వాత సాజిద్ సద్పారా, ఎలియా సైకలి కె2కి తిరిగి వెళ్లారు. అప్పటికే K2 డిజాస్టర్కు నిర్మల్ పూర్జాకు ముడిపెట్టి కొన్ని పుకార్లు వ్యాప్తిలోకి వచ్చాయి. ఫైనల్ సమ్మిట్కు వెళ్లే దారిలో రోప్స్ని నిర్మల్ పూర్జా కట్ చేశాడని, దానివల్లే స్నోరి, సద్పారా, పాబ్లో చనిపోయారనేది ఆ పుకార్ల సారాంశం. తండ్రి మృతదేహాన్ని ఎలాగైనా గుర్తించాలని తిరిగొచ్చిన సాజిద్ సద్పారా... ఆ పుకార్లలో నిజం లేదని స్పష్టం చేశాడు. నిర్మల్ పూర్జా టీమ్ ఏర్పాటు చేసిన రోప్స్ చెక్కుచెదరకుండా ఉన్నాయని ఆధారాలతో సహా రుజువు చేశాడు. చివరకు మంచుతుపానులో గడ్డకట్టుకుపోవడం వల్లే స్నోరి, అలీ సద్పారా, వాన్ పాబ్లో చనిపోయినట్లు తేల్చారు. ముగ్గురి మృతదేహాల్ని K2 పర్వతం పైనే సమాధి చేశారు.
ఈ డాక్యుమెంటరీ ఏ అడ్వెంచరస్ సినిమాకు తక్కువ కాదు. జాన్ స్నోరి కల, అలీ సద్పారా - సాజిద్ సద్పారాల తండ్రికొడుకుల అనుబంధం, వాన్ పాబ్లో - తమారా లాంగర్ లవ్ స్టోరీ, నిర్మల్ పూర్జా దూకుడు, సెవెన్ సమ్మిట్ ట్రెక్స్ దురాశ, మిస్ క్యాలిక్యులేషన్, ఎలియా సైకలి రేపిన కీర్తి కాంక్ష... ఇవన్నీ ఇందులో కనిపిస్తాయి. చావుతో సావాసం చేసే మనుషులు కనిపిస్తారు.
పాకిస్తాన్లోని మరో ఎయిట్ థౌజండర్ - బ్రాడ్ పీక్ని అధిరోహిస్తూ నిర్మల్ పూర్జా చనిపోయాడు అన్న వార్త చూడగానే... ఈ డాక్యుమెంటరీ గుర్తొచ్చింది. 43 ఏళ్ల వయసుకే మౌంటెనీరింగ్ ప్రపంచంలో మరిచిపోలేని ముద్ర వేసి వెళ్లిపోయాడు నిర్మల్ పూర్జా. ఆండిస్ గుండెలపై మరణించిన మల్లి మస్తాన్ మళ్లీ ఒకసారి గుర్తొచ్చాడు.



