Sunday, August 2, 2026

పర్వతాలు మరిచిపోలేని పేర్లు

 NIRMAL PURJA - JOHN SNORRI - ALI SADPARA - JUAN PABLO 

ఈ మధ్య ఒక డాక్యుమెంటరీకి సబ్‌టైటిల్స్ రాశాను. 2021లో K2 వింటర్ సమ్మిట్ డిజాస్టర్‌లో జాన్ స్నోరి, అలీ సద్పారా, వాన్ పాబ్లో అనే ముగ్గురు పర్వతారోహకులు చనిపోవడం గురించిన డాక్యుమెంటరీ అది. చాలా రోజులు వెంటాడిన డాక్యుమెంటరీ(లాస్ట్ మంత్ అంతర్‌గంగ దగ్గర ఒక చిన్న గుట్ట ఎక్కినప్పుడు దీని గురించి చాలా సేపు మాట్లాడుకున్నాం.) K2 వింటర్ సమ్మిట్‌కు ముందు జాన్ స్నోరిని ఒక ఐస్‌లాండ్ జర్నలిస్టు ఇంటర్వ్యూ చేస్తూ ఒక ప్రశ్న అడుగుతాడు. ఇలాంటి యాత్రకి వెళ్లేటప్పుడు చావు గురించి ఆలోచిస్తారా? అని. దానికి సమాధానంగా... "ఇలాంటి యాత్రలకు వెళ్లినప్పుడు చావు మనతో కలిసే ఉంటుంది. మనం దానికి ఎదురుతిరిగి నిలబడగలగాలి... ఆ క్షణంలో కాస్త గర్వంగా ఉంటుంది." అంటాడు స్నోరి. అదే ఇంటర్వ్యూలో స్నోరి భార్య ఒక మాట అంటుంది. "శిఖరాన్ని చేరుకున్నాక వచ్చే థ్రిల్, పర్వతారోహకులకు వ్యసనంగా మారుతుంది" అని.

పాకిస్తాన్‌కు చెందిన అలీ సద్పారా, సాజిద్ సద్పారా(అలీ కుమారుడు)ని గైడ్‌లుగా తీసుకుని సమ్మిట్‌కు వెళ్తాడు స్నోరి. అప్పటివరకు K2ని వింటర్‌లో ఎవరూ ఎక్కలేదు. 8,000 మీటర్ల కంటే ఎత్తయిన 14 పర్వతాల్లో... అత్యంత ప్రమాదకరమైన పర్వతం K2. దాన్ని వేసవిలో ఎక్కడమే కష్టం అంటారు పర్వతారోహకులు. అలాంటిది వింటర్‌లో ఎక్కాలని వెళ్లారు వీళ్లు. అది కరోనా సీజన్ కావడంతో సెవెన్ సమ్మిట్ ట్రెక్స్ లాంటి మౌంటనీరింగ్ కంపెనీల వ్యాపారాలు దాదాపు మూతబడే పరిస్థితి. స్నోరి అనౌన్స్‌మెంట్ చూసి సెవెన్ సమ్మిట్ ట్రెక్స్‌కు బిజినెస్ ఐడియా వచ్చింది. తాము కూడా K2 వింటర్ ప్లాన్ చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో కుప్పలుతెప్పలుగా ఔత్సాహికులు పాకిస్తాన్ చేరారు. ఏనాడూ పర్వతాల ముఖం చూడనివాళ్లు కూడా వీళ్లలో ఉన్నారు. 

ఏదైనా పర్వతారోహణని క్యాంపులుగా విడగొట్టుకుంటారు మౌంటెనీర్స్. బేస్ క్యాంప్, ఫస్ట్ క్యాంప్, సెకండ్ క్యాంప్, థర్డ్ క్యాంప్, సమ్మిట్. పర్వతం మొదట్లో వేసుకునేది బేస్ క్యాంప్ అయితే కొంత ఎత్తు ఎక్కాక ఫస్ట్ క్యాంప్ వేసుకుంటారు. అక్కడికి అవసరమైన సామగ్రిని అంతా మోసుకెళ్తారు. ముఖ్యంగా సమ్మిట్‌కు అవసరమైన రోప్స్. ఫస్ట్ క్యాంప్‌లో అక్కడి వాతావరణానికి అలవాటు పడే వరకు ఉండి, మళ్లీ కిందకొస్తారు. కొంత గ్యాప్ తీసుకుని ఈసారి రెండో క్యాంప్ వరకు వెళ్తారు. సామగ్రిని అక్కడికి మార్చుకుంటారు. మళ్లీ కిందకొస్తారు. ఈసారి థర్డ్ క్యాంప్ వరకు వెళ్తారు. అక్కడే రెస్ట్ తీసుకుని సమ్మిట్‌కు వెళ్తారు.  K2ని అలా మూడు క్యాంపులుగా విభజించుకుంది స్నోరి, సద్పారా టీమ్. వాళ్లు రెండో క్యాంప్ వరకు సామగ్రిని చేర్చుకుని కిందకొచ్చేసరికి... బేస్ క్యాంప్ అంతా జంతర్ మంతర్ అయిపోయింది. గుంపులు గుంపులుగా జనం వచ్చారు. అందులో నిర్మల్ పూర్జా అలియాస్ నిమ్స్‌డాయ్ టీమ్ కూడా ఉంది. దీంతో స్నోరి, సద్పారా టీమ్‌లో నిరాశ మొదలవుతుంది. తామేదో వింటర్‌లో ఫస్ట్ టైమ్ K2ని అధిరోహించిన రికార్డ్ కొట్టాలని వస్తే... వీళ్లంతా వచ్చి పరిస్థితి మార్చేశారనే బాధ కలుగుతుంది. చివరకు అంతా కలిసి పర్వతాన్ని అధిరోహించాలని నిర్ణయించుకుంటారు. అయితే నిర్మల్ పూర్జా మాత్రం తన నేపాలీ టీమ్‌తో రహస్యంగా మీటింగ్ పెట్టుకుంటాడు.

మౌంటెనీరింగ్‌లో నిర్మల్ పూర్జా ఒక సంచలనం. బ్రిటీష్ ఆర్మీలో గూర్ఖా బ్రిగేడ్‌లో 'కోల్డ్ వెదర్ వార్‌ఫేర్ స్పెషలిస్ట్'గా పనిచేసిన పూర్జా... 2014లో తొలిసారి ఎయిట్ థౌజండర్ సమ్మిట్ చేశాడు. ధవళగిరి పర్వతాన్ని అత్యంత వేగంగా ఎక్కి చూపించాడు. 2016లో ఎవరెస్ట్ ఎక్కాడు. 2018లో ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిగా పర్వతారోహణకి అంకితం అయ్యాడు. అప్పటివరకు 14 ఎయిట్ థౌజండర్స్‌ని అత్యంత వేగంగా ఎక్కిన రికార్డ్, కొరియన్ క్లైంబర్ కిమ్‌చాంగ్ హో పేరుతో ఉంటంది. 7 సంవత్సరాలా 310 రోజుల్లో ఆయన ఆ ఫీట్ సాధించాడు. అయితే 7 నెలల్లో 14 పర్వతాల్ని ఎక్కుతానని, చెప్పి మరీ చేసి చూపించాడు పూర్జా. దానికోసం నిమ్స్‌డాయ్ అవలంభించిన పద్ధతులపై విమర్శలున్నాయి. బేస్ క్యాంప్ టు బేస్ క్యాంప్ హెలికాప్టర్లలో వెళ్లడం లాంటి అంశాల్ని చాలామంది వ్యతిరేకించినా... నిర్మల్ పూర్జా సాధించిన రికార్డుల్ని తక్కువ చేసి చూడలేము.

K2 వింటర్ విషయానికొస్తే నిర్మల్ పూర్జా టార్గెట్‌లో క్లారిటీ ఉంది. అదేంటి అంటే... షేర్పాల సాయం లేకుండా ఈ పాశ్చాత్యుడు ఎయిట్ థౌజండర్ సమ్మిట్ చేసిందే లేదు. కానీ ఎక్కిన ఘనత మాత్రం పాశ్చాత్యులకే దక్కుతోంది. నేపాలీల కష్టానికి ఒక్కటైనా "ఫస్ట్ ఇన్ హిస్టరీ" గుర్తింపు ఉండాలి. అది K2 వింటర్ కావాలి. ఈ పర్వతంపై నేపాలీ షేర్పాల పేరు నిలిచిపోవాలి. నేపాలీల కంటే ముందు ఇంకెవరైనా పైకి ఎక్కాలని చూస్తే... "వాళ్ల తాళ్లు కట్ చేస్తాను" అంటాడు. రహస్య మీటింగ్‌లో ఇదే చెప్తాడు నిమ్స్‌డాయ్. అయితే స్నోరి, సద్పారా టీమ్ ఆల్రెడీ 700 మీటర్ల రోప్‌ని సెకండ్ క్యాంప్ వరకు చేర్చి  ఉన్నారు కాబట్టి వాళ్లతో కలిసి వెళ్లాలని నేపాలీ టీమ్ ఒక నిర్ణయానికి వస్తుంది. స్నోరి, సద్పారా ఒప్పుకుంటారు. అయితే ఎవరికీ చెప్పకుండానే ఒకరోజు నిర్మల్ పూర్జా టీమ్ సమ్మిట్ పూర్తి చేసి తిరిగొస్తుంది. అంతా షాక్. పాకిస్తాన్ ఆర్మీ వచ్చి వాళ్లని సన్మానిస్తుంది. సన్మానించిన వాళ్లు ఊరికే పోకుండా... "మీరు ఎక్కారు సరే, మా అలీ సద్పారా టీమ్ ఇక్కడికి వచ్చి నెల దాటింది. వాళ్లు ఇంకా ఎందుకు ఎక్కలేదు?" అని గెలికి పోతారు. దాంతో స్నోరి, సద్పారాల ఈగో హర్ట్ అవుతుంది. అదే సమయంలో ఎలియా సైకలి అనే ఫిల్మ్‌మేకర్ వచ్చి, అలీ సద్పారా గొప్పతనంపై డాక్యుమెంటరీ తీస్తానని చెప్పడంతో... తనలో కసి పెరుగుతుంది. కొన్ని సందర్భాల్ల్లో దీన్ని కీర్తి కాంక్ష అని కూడా అనుకోవాలి.

నిర్మల్ పూర్జా టీమ్ విజయాన్ని బేస్ క్యాంప్ దగ్గర సెలబ్రేట్ చేసుకునే సమయంలోనే... సెకండ్ క్యాంప్ నుంచి కిందకు దిగొస్తూ సెర్జీ మింగోటే అనే పర్వతారోహకుడు... అంత ఎత్తు నుంచి కిందకు పడి చనిపోతాడు. దాంతో బేస్ క్యాంప్ దాదాపు సగానికి పైగా ఖాళీ అయిపోతుంది. స్నోరి, సద్పారా టీమ్ మరో వెదర్ విండో కోసం ఆగుతారు. అనుకూల వాతావరణానికి సంబంధించిన రిపోర్ట్ రాగానే ఫైనల్ సమ్మిట్‌కు సిద్ధమవుతారు. సెవన్ సమ్మిట్ ట్రెక్స్‌తో వచ్చిన వాళ్లు కూడా వీళ్లతో బయలుదేరుతారు. 

పర్వతారోహణలో అత్యంత కీలకమైంది టైమింగ్. ఫస్ట్ క్యాంప్ వరకు ఇన్ని గంటల్లో చేరుకోవాలి, సెకండ్ క్యాంప్‌కు ఇన్ని గంటలు, థర్డ్ క్యాంప్‌కు ఇన్ని గంటలు, సమ్మిట్‌కు ఇంత సమయం... ఇలా ప్రతిదీ టైమింగ్‌లోపు పూర్తవ్వాలి. ఎక్కడైనా టైమింగ్ మిస్ అయిందా, అన్నీ మూసుకుని వెనక్కి వెళ్లిపోవాలి. ముందుకుపోతే మాత్రం... కాలం ఎంత కర్కశమైంది అనేది తెలుస్తుంది. K2 వింటర్‌ని డిజాస్టర్ చేసింది ఆ కాలమే. కాకపోతే తప్పు ఒకరు చేస్తే... ఫలితం ఇంకొకరు అనుభవించారు.

ఫిబ్రవరి 4, 2021లో స్నోరి, సద్పారా టీమ్ K2 వింటర్ ఫైనల్ సమ్మిట్ మొదలుపెడతారు. వాళ్లతో వాన్ పాబ్లో(JP) - తమారా లాంగర్ టీమ్, సెవెన్ సమ్మిట్ ట్రెక్స్ టీమ్ కూడా బయలుదేరుతారు. స్నోరి, అలీ సద్పారా, సాజిద్ సద్పారా... థర్డ్ క్యాంప్ చేరుకుని టెంట్ వేసుకుంటాడు. వాన్ పాబ్లో, తమారా లాంగర్ కూడా చేరుకుంటారు. కొలిన్ అనే మరో యువ క్లైంబర్ కూడా పైకి చేరుకుని టెంట్ వేసుకుంటాడు. గడువు ముగిసిపోవడంతో మిగిలినవాళ్లంతా వెనక్కి వెళ్లిపోయుంటారు అనుకుంటారు. కానీ రాత్రి గడిచేకొద్ది వచ్చేవాళ్లు వస్తూనే ఉంటారు. కానీ థర్డ్ క్యాంప్‌లో టెంట్లు ఉండవు. ప్రతి ఒక్కరూ తమ టెంట్ ఇంకొకరు తెస్తున్నారులే అన్న భ్రమలో ఉంటారు. చివరకు టెంట్లు లేకుండా పైకి వస్తారు. సెవెన్ సమ్మిట్ ట్రెక్స్ మాత్రం... ఎవరూ గడువు లోపల థర్డ్ క్యాంప్ వరకు చేరుకోరులే అన్న ఉద్దేశ్యంతో సరిపడా టెంట్లు పంపించదు. ఒకవేళ అందరూ నిర్ణీత సమయంలోనే థర్డ్ క్యాంప్ వరకు చేరుకుంటే ఏంటి పరిస్థితి? ఈ ప్రశ్నకు సెవెన్ సమ్మిట్ ట్రెక్స్ దగ్గర సమాధానం ఉండదు. 

చివరకు ఉన్న మూడు టెంట్లలోనే అంతా సర్దుకుంటారు. ఎవరికీ రెస్ట్ దొరకదు. మరుసటి పొద్దుటికి అంతా తీవ్రంగా అలసిపోయి కనిపిస్తారు. ఈ సందర్భంలో కొలిన్ స్పష్టంగా నిర్ణయించుకుంటాడు... పర్వతారోహణకు సంబంధించి తాను పెట్టుకున్న 10 అంశాల్లో 9 అనుకూలంగా లేవు. దీంతో కిందకు వెళ్లిపోవాలి అనుకుంటాడు. చివరకు జాన్ స్నోరి, అలీ సద్పారా, సాజిద్ సద్పారా, వాన్ పాబ్లో మాత్రమే ఫైనల్ సమ్మిట్‌కు వెళ్తారు. మిగిలిన అంతా కిందకు వెళ్లిపోతారు. అలా వెళ్తుండగా ఆటనస్ స్కటోవ్ అనే క్లైంబర్... దాదాపు 2,000 మీటర్ల ఎత్తు నుంచి కిందకు పడి చనిపోతాడు. అందరూ కిందకు దిగేసరికి మరో వార్త. స్నోరి, అలీ సద్పారా, వాన్ పాబ్లో ఇంకా సమ్మిట్ పూర్తి చేయలేదని, వాళ్లు ఏమయ్యారో తెలియడం లేదని. ఆక్సిజన్ రెగ్యులేటర్ పనిచేయక సాజిద్ సద్పారా, బాటిల్‌నెక్ దగ్గర్నించి వెనక్కి వచ్చి థర్డ్ క్యాంపులో ఎదురుచూస్తూ కూర్చుంటాడు. గంటలు గడిచినా పైకి వెళ్లిన ముగ్గురూ తిరిగి వస్తున్న జాడ లేదు. రెస్క్యూ టీమ్ వచ్చి వెతికిచూసింది. అప్పటికే సాజిద్‌కు అర్ధమైంది. వాళ్లు ఇక రారని... లేరని. 

నాలుగు నెలల తర్వాత సాజిద్ సద్పారా, ఎలియా సైకలి కె2కి తిరిగి వెళ్లారు. అప్పటికే K2 డిజాస్టర్‌కు నిర్మల్ పూర్జాకు ముడిపెట్టి కొన్ని పుకార్లు వ్యాప్తిలోకి వచ్చాయి. ఫైనల్ సమ్మిట్‌కు వెళ్లే దారిలో రోప్స్‌ని నిర్మల్ పూర్జా కట్ చేశాడని, దానివల్లే స్నోరి, సద్పారా, పాబ్లో చనిపోయారనేది ఆ పుకార్ల సారాంశం. తండ్రి మృతదేహాన్ని ఎలాగైనా గుర్తించాలని తిరిగొచ్చిన సాజిద్ సద్పారా... ఆ పుకార్లలో నిజం లేదని స్పష్టం చేశాడు. నిర్మల్ పూర్జా టీమ్ ఏర్పాటు చేసిన రోప్స్ చెక్కుచెదరకుండా ఉన్నాయని ఆధారాలతో సహా రుజువు చేశాడు. చివరకు మంచుతుపానులో గడ్డకట్టుకుపోవడం వల్లే స్నోరి, అలీ సద్పారా, వాన్ పాబ్లో చనిపోయినట్లు తేల్చారు. ముగ్గురి మృతదేహాల్ని K2 పర్వతం పైనే సమాధి చేశారు.

ఈ డాక్యుమెంటరీ ఏ అడ్వెంచరస్ సినిమాకు తక్కువ కాదు. జాన్ స్నోరి కల, అలీ సద్పారా - సాజిద్ సద్పారాల తండ్రికొడుకుల అనుబంధం, వాన్ పాబ్లో - తమారా లాంగర్ లవ్ స్టోరీ, నిర్మల్ పూర్జా దూకుడు, సెవెన్ సమ్మిట్ ట్రెక్స్ దురాశ, మిస్ క్యాలిక్యులేషన్, ఎలియా సైకలి రేపిన కీర్తి కాంక్ష... ఇవన్నీ ఇందులో కనిపిస్తాయి. చావుతో సావాసం చేసే మనుషులు కనిపిస్తారు.

పాకిస్తాన్‌లోని మరో ఎయిట్ థౌజండర్ - బ్రాడ్ పీక్‌ని అధిరోహిస్తూ నిర్మల్ పూర్జా చనిపోయాడు అన్న వార్త చూడగానే... ఈ డాక్యుమెంటరీ గుర్తొచ్చింది. 43 ఏళ్ల వయసుకే మౌంటెనీరింగ్ ప్రపంచంలో మరిచిపోలేని ముద్ర వేసి వెళ్లిపోయాడు నిర్మల్ పూర్జా. ఆండిస్ గుండెలపై మరణించిన మల్లి మస్తాన్ మళ్లీ ఒకసారి గుర్తొచ్చాడు.

Thursday, July 9, 2026

21 గ్రామ్స్



ప్రాణం బరువెంత..?

ఫిజికల్లీ 21 గ్రామ్స్

మరి మానసికంగా..?


ప్రేమ బరువెంత... 

పాపం బరువెంత...

పగిలిన బతుకుల బరువెంత?


ఆశ, పాశం, పాపం

ప్రాణం ఒక తీర్చలేని రుణం

పాపం ఒక మోయలేని భారం


పీల్చేగాలి విషం అనిపించేంత

ప్రియమైన వారి ముందూ ఉండలేనంత

ప్రాణమే పోతున్నంత


గుండె గాయాన్ని ఎవరైనా

చనుమొనలతో నిమరాలి

నా లోపలి హమ్మింగ్‌బర్డ్ ఎగిరి పోయేదాకా..!

Tuesday, November 25, 2025

అడవి ప్రవహిస్తుంది..!

చెట్టుని పట్టె మంచం చేసుకోగానే

అడవి మనకు అర్ధమైనట్టు కాదు

అక్కడ రాలిన ఆకుల బాధ

మనకి అర్ధమూ కాదు

శిశిరం అనుకోవచ్చు

ఇక్కడితో అడవి అంతమైంది అని

వసంతం రావచ్చు, రాకపోవచ్చు

అడవి మళ్లీ చిగురించకపోవచ్చు

కానీ...

అడవికి తెలుసు

ఎడారుల్లోకి ఎలా ప్రవహించాలో

ఏమీ లేనిచోట 

వెదురు వనాలై ఎలా వికసించాలో

ఖనిజాల వేటలో

రాలిన ఆకుల నెత్తురు

కొత్త ఊపిరులు పీల్చుకోవచ్చు

కాంక్రీట్ జూల్లోకి కానలు ప్రవహించడం 

కాస్త కష్టం కావచ్చు

ఆక్సిజన్ అందక అల్లాడే మనుషులకు

అది అత్యవసరం అయ్యే రోజు వస్తుంది

పన్నెండు గంటలు అంటున్నారు

అప్పుడే పది చేశారు

నీళ్లు విషం, గాలి విషం, 

తినే తిండి విషం

థూ... ఏం బతుకురా ఇది..?

నీరసం నిండిన ఈ తరం

నిస్తేజమే మతమైన మనుషులు

ఏదో ఒకరోజు ప్రశ్నించడం నేర్చుకోవచ్చు

అడవి ప్రజాస్వామ్యమై

హస్తినని పడగొట్టే రోజొకటి రావచ్చు

Saturday, May 10, 2025

సైనికుడు - సరిహద్దు

మూడు రోజుల్లో ముగిస్తాం!

ఐదు రోజుల్లో తేల్చేస్తాం!

మొదలు పెట్టేటప్పుడు అందరూ ఇదే చెప్తారు. ఇప్పుడు ముగిసిపోవడానికి, ఇప్పుడే మొదలైంది కాదు ఇది. 78 ఏళ్ల కాష్టం. యుద్ధం మరో యుద్ధానికి పురుడు పోస్తుందే తప్ప శాంతి రాదు. పార్టీలు, వాటి రంగులు మారొచ్చు కానీ వాళ్లు నడిపేది ప్రభుత్వాన్నే. దాని లక్షణం ఎప్పటికీ మారదు. ఇలాంటి సమయాల్లో జనం జై కొట్టాల్సింది ప్రభుత్వాలకి కాదు... జవాన్లకి! మద్దతివ్వాల్సింది ప్రభుత్వాలకి కాదు... సైనికులకి, సరిహద్దుల్లో ఉన్న ప్రజలకు! వాళ్ల జీవితాలు నిత్యాగ్నిగుండాలు. వాళ్ల ప్రాణాలతో పండుగ చేసుకోవద్దు. యుద్ధం సమస్యనీ ముగించలేదు. ఇంకొందరి సిందూరాలు తుడవడం తప్ప

సైనికుల జీవితాల్ని చాలా దగ్గర నుంచి చూశాను. మా నాన్న బరేలీలో ఉన్నప్పుడు లీవ్ అడిగితే తిట్టాడని, కమాండింగ్ ఆఫీసర్ని కుర్చితో కొడితే ఆయన చనిపోయాడు. వెంటనే అరెస్ట్ చేశారు. రెండు మూడు నెలలు జీతం లేదు. ఖర్చులకు ఇంటి దగ్గర నుంచే మా అమ్మ డబ్బులు పంపింది. ఇంక మా నాన్న రాడేమో అని మమ్మల్ని పట్టుకుని ఏడ్చేది. మేమూ ఏడ్చేవాళ్లం తప్ప, విషయం పూర్గిగా తెలియదు. నాకు అప్పుడు ఆరేళ్లు ఉంటాయి. అందరి ముఖాల్లో ఏడుపు తప్ప ఇంకేమీ కనిపించేది కాదు. మూడు నెలల తర్వాత మిలట్రీ కోర్టు మా నాన్నని వదిలేసింది. మా అమ్మ పడిన సంబరం నాకిప్పటికీ గుర్తుంది. మామూలు కోర్టుల కంటే మిలట్రీ కోర్టులు మనసున్నవి అని ఇప్పటికీ నేను నమ్మేలా చేసిన ఘటన. కోర్టు, జరిగిన ఘటనని మాత్రమే చూడలేదు. సైనికుడి గుండె చూసింది. ఎంత నలిగిపోయి ఉంటే అంత కోపం వస్తుందో గుర్తించింది

మళ్లీ యూనిఫామ్ వేసుకోగానే మా నాన్నకి వేసిన తొలి డ్యూటీ... చనిపోయిన కమాండింగ్ ఆఫీసర్ ఫ్యామిలీని ఇంటి దగ్గర దించి రావడం. రెండు రోజుల ప్రయాణంలో వాళ్లు ఏం పెట్టినా తినలేదంట మా నాన్న. ఏమైనా కలిపి ఇస్తారేమో అని భయం. ఇంటికి వెళ్లాక సీవో భార్య, మా నాన్నని పిలిచి ఫ్యామిలీ గురించి అడిగిందట. సర్వీస్ పొడిగించుకోకుండా సాధ్యమైనంత త్వరగా రిటైర్ అయి భార్యాపిల్లలతో కలిసి మంచిగా బతుకు అని దీవించి పంపిందంట. కోర్టు తండ్రి స్థానంలో ఉండి తీర్పు ఇస్తే, ఆమె తల్లిలా దీవించి పంపింది. ఆమె మాట ప్రకారమే సర్వీస్ కంటే నాలుగేళ్లు ముందుగానే రిటైరయ్యాడు మా నాన్న. కానీ బాధని మాత్రం ఆయన బతికున్నన్నాళ్లూ మోశాడు. అది నేను స్పష్టంగా చూశాను.

ఎంతోమంది సైన్యంలో నలిగిపోయి ఆత్మహత్యలు చేసుకున్నవాళ్లున్నారు. నిద్రలేచిన దగ్గర నుంచి వాళ్ల జీవితం యుద్ధం. ఆర్డర్ పాటించడం తప్ప, ప్రశ్నించడం తెలియదు సైనికుడికి. అలా శిక్షణ ఇస్తారు. ట్రయినింగ్లో ఉన్న సిపాయితో ఎప్పుడైనా మాట్లాడి చూడండి. షో చేయడానికి వాళ్లు టెరిటోరియల్‌ 'పైలట్లు' కాదు. అసలైన సైనికులు. వాళ్ల పని డిఫెన్స్. ఎదురు ప్రశ్నించడం తెలియకపోయినా సైనికుడు సైనికుడే. స్లేవ్ కాదు. అత్యవసర పరిస్థితిలోనే యుద్ధం. ఎమోషన్ కోసం కాదు. ఆపరేషన్ లక్ష్యం ముగిసింది. ఇంకా కొనసాగించడం జవాన్ ప్రాణాలతో ఆడుకోవడమే. ఎప్పుడూ వాళ్లే మనల్ని కాపాడటం కాదు. మనమూ వాళ్లని కాపాడుకోవాలి. మరణాల ఉసురు తగిలేది మనకే

సైన్యం కంటే ముందే సరిహద్దుకు వెళ్తామన్న వాళ్లెవరూ ఇప్పుడు కనిపించడం లేదు. వీళ్లెవరూ అక్కడ చావడం లేదు. సైనికులు, అక్కడి ప్రజలే బలి అవుతున్నారు. పంజాబ్లో అయితే గొడవ మొదలయ్యేసరికి సరిగ్గా కోతలకాలం సగంలో ఉంది. అయినా ఊళ్లకు ఊళ్లు ఎమర్జన్సీ స్థితిలోకి వెళ్లిపోయాయి. దూరం నుంచి దీపావళిలా చూస్తున్నాం మనం. మనకు చేతనైతే యుద్ధం ఆపాలని చెప్పాలి. త్వరగా దాన్ని ముగించే దారులు వెతకాలని కోరాలి. ఏకాకిని చేస్తేనే... చచ్చే ప్రత్యర్ధి అవతల ఉన్నది. మన పతనం కోసం ఎదురుచూసే బలమైన ప్రత్యర్ధులు ఇంకా వేరే ఉన్నారు. మధ్యవర్తిత్వం పేరుతో వచ్చి వాలడానికి వాళ్లు రెడీగా ఉన్నారు. వాళ్లకి ఇది అవకాశం కాకూడదు.


Friday, April 25, 2025

ఒకే మతం... ఒకే దేశం..!

ప్రపంచంలో క్యాపిటలిజం తప్ప మరో మతం లేదు. పాత మతాల్లో దేవుళ్లు, దెయ్యాల గోల ఉంటుంది. కానీ దెయ్యాలు మాత్రమే ఉండే మతం ఇది. అనుసరించడం మనకు అనివార్యం. అసలు నీ అనుమతి ఎవడిక్కావాలి. నువ్వు పుట్టకముందే నువ్వు క్యాపిటలిస్టువి. నేనూ అంతే. 

యుద్ధాన్ని అదే పుట్టిస్తుంది. శాంతి కోసం అదే ఏడుస్తుంది. కుట్ర ఎవరైనా చేయొచ్చు. యుద్ధం అది చెప్పినవాళ్లతోనే చేయాలి. వార్‌కి ఒక మార్కెట్. శాంతికి మరో మార్కెట్. రెండు చోట్లా లాభపడేది మాత్రం బిగ్ ప్లేయర్లే. మనుషులు ఇక్కడ మార్కెట్ ముడిసరుకులు. బిగ్ ప్లేయర్స్ విల్ ప్లే విత్ దెమ్ అకార్డింగ్ దెయిర్ ఇంటరెస్ట్. పంచభూతాలే అంగడి సరుకులుగా మారిపోయాయి. నువ్వెంత..!  నువ్వు ఏం తినాలి, ఏం కట్టుకోవాలి, ఏ భాష మాట్లాడాలి, ఎవరిని పూజించాలి, ఎవరితో కలిసి బతకాలి, ఎంతమందిని కనాలి, ఏ పని చేయాలి, ఎవర్ని ద్వేషించాలి, ఎప్పుడు చావాలి..? ఇట్ డిసైడ్స్ ఎవ్రీథింగ్. నాకు నచ్చినట్టు బతుకుతున్నా అని సోకులు చెప్పుకోవద్దు. యు డోన్ట్ హేవ్ ఎనీ ఎగ్జంప్షన్స్. 

భిన్నత్వంలో మనుషులకి ఇష్టాఇష్టాలు ఉంటాయి. ఏకత్వంలో మార్కెట్ చెప్పిందే శాసనం. మనుషులంతా హెర్డ్ థియరీ పాటిస్తేనే దానికి లాభం. సమూహాలన్నీ ఒకే దేవుడ్ని పూజిస్తే లాభం. సామ్రాజ్యవాదం పునాదిగా ఎదిగిన మతాలనే చూడండి. ఒకే దేవుడు ఉంటాడు. మిగిలిన చిన్నా చితకా మతాలు కూడా ఇప్పుడు పాటిస్తున్నది అదే. ఈ మతాలన్నీ తమ అసలు ఆకారాన్ని ఎప్పుడో కోల్పోయాయి. క్యాపిటలిజం అవసరాల మేరకు మాత్రమే ఉనికిలో ఉన్నాయి. ప్రపంచం ఏకత్వం వైపు ఎప్పటినుంచో నడుస్తోంది. నడిపించబడుతోంది. మన తరమో, మరో తరమో... ఇట్స్ ఇనెవిటబుల్.

Saturday, March 22, 2025

అనోరా : HONOR

ప్రపంచం అంతా పరితపించే లగ్జరీ. స్వేచ్ఛ కంటే ఖరీదైనది. ఓలిగార్క్‌లు కూడా కొనలేనిది. అనోరా కావాలి అనుకునేది. ది ఆనర్. ఈ సినిమాలో ఇగోర్ కళ్లలో దొరుకుతుంది. 


న్యూడిటీ తప్ప కట్టిపడేసే కథ ఏం ఉంది ఇందులో అనిపించింది మొదట. స్ట్రిప్ క్లబ్‌లో డ్యాన్సర్‌గా పనిచేస్తుంటుంది అనోరా. సినిమా ప్రారంభంలో ఒక కస్టమర్ అడుగుతాడు... నువ్వు ఈ పని చేస్తున్నట్టు మీ ఇంట్లోవాళ్లకి తెలుసా? అని. తెలుసంటుంది. వాళ్లు దీనికి ఓకేనా? అంటాడు. నువ్వు ఇక్కడికి వచ్చినట్టు మీ ఇంట్లోవాళ్లకి తెలుసా? అని ప్రశ్నిస్తుంది అనోరా. తెలియదు అని చెప్తాడు. ఎక్కడా పాజ్‌లు, ఎమోషన్స్ కట్ చేయడం ఉండదు. ఇట్సే ఫ్లో. నాటకీయతకి చోటే ఉండదు. అలా సాగిపోతుంది.

ఒక రష్యన్ ఓలిగార్క్ కొడుకు వాన్యా, అనోరాని బుక్ చేసుకుంటాడు. ఇద్దరూ కామంలో, డ్రగ్స్‌లో మునిగితేలుతారు. ఆ కుర్రాడు ఆ ట్రిప్ ముగించి రష్యా వెళ్తే, అక్కడ తండ్రి కంపెనీలో పనిచేస్తూ పర్మనెంట్‌గా ఉండాలి. కానీ అమెరికాలో ఎవరినైనా పెళ్లి చేసుకుంటే, గ్రీన్‌కార్డ్ సంపాదించి ఇక్కడే ఉండిపోవచ్చు. కామంలోనే అనోరాని ఇష్టపడి, ఆమె ముందు పెళ్లి ప్రపోజల్ పెడతాడు. ముందు ఆమె ఒప్పుకోదు. కానీ ఆమెని నిజంగానే ఇష్టపడుతున్నాను అని చెప్తాడు. పెళ్లయ్యాక వాడి ఇంట్లో తెలుస్తుంది. ఇద్దర్నీ విడదీయాలి అనుకుంటారు. ఆమె గొప్పగా చూసుకుంటున్న ఎంగేజ్‌మెంట్ రింగ్‌ని బలవంతంగా లాక్కుంటారు. మొదట పెళ్లి రద్దుని ప్రతిఘటించిన అనోరా, వాన్యా గాడి నిజస్వరూపం చూశాక వివాహం రద్దుకి ఒప్పుకుంటుంది. 

ఇద్దర్నీ విడదీయడానికి వచ్చిన గ్యాంగ్‌లో ఇగోర్ అని ఒకడుంటాడు. నిజానికి తనకి దక్కాల్సిన గౌరవం కోసం అనోరా పోరాడే సమయంలో... ఆ బాధ ఆమె నుంచి కంటే, ఇగోర్ కళ్లలో బాడీలాంగ్వేజ్‌లో వ్యక్తమయ్యేలా చూపడంలో డైరెక్టర్ షాన్ బేకర్ టేకింగ్ కనిపిస్తుంది. ఎక్కడా పైకి వ్యక్తం చేయడం ఉండదు. క్లైమాక్స్‌లో అనోరా ఎంగేజ్‌మెంట్ రింగ్‌ని ఆమెకే ఇవ్వడం, తర్వాత ఇద్దరూ ఒక్కటయ్యే సీన్‌ కదిలిస్తుంది. 

సినిమా అంతా బలమైన స్త్రీగా అనోరా పాత్రని చిత్రీకరించారు. అలాంటి అనోరాలో భయంతో, బాధతో వణికిపోయే ఒక చిన్నపిల్ల ఉంటుంది. ఆ చిన్నారి ఆఖరి సీన్‌లో మన కళ్లముందుకొస్తుంది. ఏడుస్తూ బేలగా ఇగోర్ గుండెలపై వాలిపోయే ఆ సీన్ కంటతడి పెట్టిస్తుంది.

Friday, November 1, 2024

NOCTURNAL ANIMALS



గతం... 

ప్రస్తుతం...

ఒక కథ...

ఎంత కృత్రిమంగా రాయాలన్నా

ఎంతో కొంత జీవితం అతుక్కుంటుంది

రాత్రి బహుచెడ్డది

వెలుగుని చూడనీదు

మైత్రి కుదరనీదు

అందుకే అప్పుడప్పుడైనా నిద్రపోవాలి

మనుషులు మళ్లీ దొరకరు

ఒక చేయి విడిస్తే

ఇంకో తోడు దొరుకుతుంది అనుకోకు

చీకటి ఒక ఒంటరి

గతం దానికి తోడు

నిన్ను వదలదు, నీతో ఉండదు