Friday, December 16, 2016

చూపున్న అక్షరాలు

అక్ష‌రాలంటేనే చూపునిచ్చేవి అనొచ్చు. కానీ అన్ని అక్ష‌రాల‌కీ అంత శ‌క్తుంటుందా అన్న ప్ర‌శ్న వెంట‌నే వ‌స్తుంది. పొయొటిగ్గా మాట్లాడుకోవ‌డం ప‌క్క‌న‌బెడితే అక్ష‌రానికి ప్ర‌త్యేక విలువ ఏమీ ఉండదు. అక్ష‌రాల‌కి అంత విలువే ఉంటే.. చ‌దువుకున్న ప్ర‌తోడు మ‌హాజ్ఞాని అయి ఉండాలి. ఇక‌ విష‌యానికొస్తే స‌రిగ్గా ఏడాది కింద‌ట హైద‌రాబాద్ బుక్ ఫెయిర్‌లో ప‌తంజ‌లి ర‌చ‌న‌ల సంపుటి-1,2 కొన్నాను. కేశ‌వ‌రెడ్డి భ‌గ‌వానువాచ‌, ఇన్‌క్రెడిబుల్ గాడెస్ కూడా కొన్నాను. అప్ప‌టికే మునెమ్మ‌, చివ‌రిగుడిసె, అత‌డు అడ‌విని జ‌యించాడు, మూగ‌వాని పిల్ల‌నగ్రోవి చ‌దివుండ‌టం వ‌ల్ల‌(ప్రత్యేకమైన కొత్త ఇంట్రస్ట్ లేకపోవడం వల్ల).. కేశ‌వ‌రెడ్డి పుస్తకాల్ని ఇప్ప‌టికీ తెర‌వ‌లేదు. ఎప్ప‌టినుంచో చ‌ద‌వాల‌ని ఉండ‌డం వ‌ల్ల‌.. ప్ర‌త్యేకించి కొనుక్కొచ్చినందు వ‌ల్ల ప‌తంజ‌లిని చ‌ద‌వ‌డం మొద‌లెట్టా. అప్ప‌టికే ముక్కామ‌ల చ‌క్ర‌ధ‌ర్ గారి వ‌ల్ల‌.. గెలుపు స‌రే బ‌త‌క‌డం ఎలా చ‌దివి ఉన్నా. నిజానికి అప్ప‌టినుంచే ప‌తంజ‌లిని చ‌ద‌వాల‌ని ఉన్నా.. లాస్ట్ ఇయ‌ర్ డిసెంబ‌ర్‌కి కానీ కుద‌ర్లేదు. బుక్ తెచ్చినంత ఈజీగా చ‌ద‌వ‌డం మొద‌లుపెట్ట‌లేం. చివరికి ఓ ఫ్రెండ్ స‌ల‌హాతో రాజుగోరు ద‌గ్గ‌ర నుంచి మొదలుపెట్టా. అక్క‌డ్నించి ఒక దెయ్యం ఆత్మ‌క‌థ వ‌ర‌కూ ఏక‌బిగిన చ‌దివా. అంటే రోజుల్లో కాద‌నుకోండి. ఒక‌ట్రెండు నెల‌ల్లో..

హైద‌రాబాద్‌కి వ‌చ్చిన కొత్త‌ల్లో యూసుఫ్‌గూడ‌లో ఉన్న ఓ లైబ్ర‌రీ నుంచి యండ‌మూరి, య‌ద్ద‌న‌పూడి, మ‌ల్లాది ల న‌వ‌ల‌లు రోజుకొక‌టి తీసుకెళ్లి చ‌దివి ఇచ్చేసేవాడ్ని. సైజు ఎంత పెద్ద‌వైనా ఐదారు గంట‌ల్లో చ‌దివేసేవాడ్ని. కానీ కేశ‌వ‌రెడ్డి చివ‌రిగుడిసె అనే 90 చిన్న‌పేజీల పుస్త‌కం చ‌ద‌వడానికి ఒక రాత్రంతా(12గంట‌ల‌కు మించే) ప‌ట్టింది. కానీ చివ‌రిగుడిసె ఏడిపించినంతగా, ఆలోచింప‌జేసినంత‌గా యూసుఫ్ గూడ లైబ్రరీ పుస్తకాలేవీ చేయలేదు. అలాగ‌ని అవి నాకు మ‌రే అనుభూతినీ ఇవ్వ‌లేద‌ని కాదు. కాకపోతే దానికీ దీనికీ స్వ‌ప్న స్ఖ‌ల‌నానికీ.. రియ‌ల్ ఆర్గాజ‌మ్‌కి ఉన్నంత తేడా ఉంది. చూపున్న అక్ష‌రాలు అని అందుకే అంటున్నా. ప‌తంజ‌లి రాజుగోరు చ‌దవ‌డం మొద‌లయ్యాక.. ప‌డీప‌డీ న‌వ్వ‌డం, కాసేపు ఏదో ఆలోచించ‌డం.. తెలిసిన మనుషులెవరో కనిపించినట్టు అనిపించడం.. అదో చిత్ర‌మైన అనుభవం. కొన్నిసార్లు ఏళ్లుగా చ‌దువుకున్న‌దంతా త‌ప్ప‌యిన‌ట్టు.. భూమి బ‌ల్ల‌ప‌రుపుగా ఉంద‌న్న నిర్ధార‌ణ‌కు వ‌చ్చేస్తాం. భూమి బ‌ల‌వంతుడికి న‌చ్చిన ఆకారంలో ఉంటుంద‌న్న నిర్ధార‌ణ‌కు వ‌చ్చేస్తాం. ముఖ్య‌మంత్రుల్లో అప్ప‌న్న‌స‌ర్దార్‌ల‌ని చూస్తాం. మ‌హామేధావుల్లో లెక్కల తాబేళ్ల‌ని చూస్తాం. అక్ష‌రాల‌తో అదో స‌ర‌దా స‌మ‌రం. 

కానీ మిత్రుడి స‌ల‌హాతో రాజుగోరు ద‌గ్గ‌ర్నుంచి మొద‌లుపెట్టిన నాకు.. ఒక దెయ్యం ఆత్మకథ తర్వాత, వెనక్కొచ్చి ఖాకీవ‌నం చ‌ద‌వ‌డానికి భ‌య‌మేసింది. మ‌ళ్లీ పుస్త‌కాన్ని మూల‌న‌పెట్టేశా. ఎందుకో ఒక‌రోజు పేజీలు తిర‌గేస్తుంటే.. 'పెంకుల నుంచి గదిలోకి కారుతూ మసక చీకటి' అన్న లైన్ కనిపించింది. పేజీ చేతిలోంచి జారిపోయి తర్వాత పేజీ తిరిగింది. 'అడవిలో అమాయకంగా బతికే జింకలకు వాడి కొమ్ములుండాలి. తోటలో తెల్లగా బతికే వెర్రిముండా పావురాలకైనా ఉక్కు ముక్కులుండాలి. పెరట్లో గంతులేసే కుందేళ్లకైనా విషపు కోరలుండాలి. స్త్రీలందరి దగ్గరా మిషన్ గన్స్ ఉండాలి'. కమలి చెప్తున్న ఈ వాక్యాలు చదివాక వెంటనే ఖాకీవనం తొలి పేజీ తీశాను. మరుసటి రోజు ఉదయానికి చివరి పేజీ తిప్పేశాను. మళ్లీ ఒక రాత్రిని పతంజలికి అంకితమిచ్చాను. ఖాకీవనంలో కమలిలా కాసేపు, భాస్కర్లా, ప్రభాకర్ లా కాసేపు,  లక్ష్మణరావులా ఇంకాసేపు తిరిగాను. చివరకు 'అవే చూపులు.. అందులో అవే కత్తులు' అంటూ ముగించాను. 
ఈ చూపున్న అక్షరాల తోటలో ఇంకా కొన్ని పేజీలున్నాయి. చదవాలి. 

No comments:

Post a Comment