Thursday, May 30, 2019

వైట్ టైగర్

'They remain slaves because they cant see what is beautiful in this world-IQBAL'

భారతదేశంలో నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం అనేవి దరిద్రులు మాత్రమే పాటించాల్సిన నియమాలు. అగ్రవర్ణాల ధనవంతులు, పాలకులకి జీవితాంతం ఏదో ఒకరూపంలో సేవ చేసుకోవడమే దరిద్రుల విధిరాత. ఈ దరిద్రులు కట్టుతప్పకుండా కొందరు బానిస దేవుళ్లనీ సృష్టించారు. ఆ బానిస దేవుళ్ల జీవితం మొత్తం తమ యజమానుల పాదపూజ చేసుకోవడమే. కొండలు పెకళించే శక్తి ఉన్నా... కేవలం యజమానుల సేవే పరమావధిగా ఎలా ఉంటారో అరవింద్ ఆడిగ వైట్ టైగర్ నవల చెప్తుంది. అందులోంచి బైటపడాలంటే అడ్డదారి తప్ప మరోదారి లేని పరిస్థితుల్ని... తన హీరో బలరాం ద్వారా మనకి వివరిస్తాడు.

భారతదేశానికి రెండు ముఖాలు
ఒకటి లక్ష్మణ్‌గ‌ఢ్
రెండు బెంగళూరు

ఒకటి చీకటి
రెండు వెలుతురు

భారతదేశంలో రెండు రకాల మనుషులుంటారు
బలిసిన బాన పొట్టలు
బానిసత్వంలో కునారిల్లే చిన్న పొట్టలు

గాడ్స్ ఆఫ్ స్లేవ్స్...
ఉత్తమ బానిస ఎలా ఉండాలి ?
యజమానికి సేవ చేసుకోవడం తన పూర్వజన్మ సుకృతంలా భావించాలి. యజమాని కాళ్లు నొక్కుతున్నా తన కళ్లలో ప్రేమ కురుస్తూ ఉండాలి. వాడి కాలితో నెత్తిమీద తన్నితే... చిరునవ్వుతో స్వీకరించాలి. అన్నింటికంటే ముఖ్యంగా ప్రతిఫలం గురించి పెద్దగా ఆశించకుండా, అలసట అనేది తెలియకుండా పనిచేస్తూనే ఉండాలి.
నవల మొదటల్లో తన సొంత ఊరు గురించి వర్ణిస్తూ ఓ గుడి గురించి ఇలా చెప్తాడు బలరామ్.
"At the end of the market there is a tall, whitewashed, conelike tower, with intertwining snakes... inside you will find an image of a saffron coloured creature, half human half monkey-Hanuman, everyone's god in darkness. he was faithful servant of the god Rama, and we worship him in our temples because he is a shining example of how to serve your owners with fidelity, love, devotion.

These are gods they foisted on us. understand now, how hard it is for a man to win his freedom in india."

బఫెలో...
లక్ష్మణ్‌గఢ్‌ని శాసించే నలుగురు ధనవంతుల్ని నాలుగు జంతువుల పేర్లతో పిలుచుకుంటుంటాడు బలరాం. బర్రె, అడవి పంది, బలిసిన కాకి, ముంగిస. వీటన్నింటిలో బర్రె గురించి తను చెప్పే విధానం బాగుంటుంది. అది నాకు ఈ దేశ ప్రభుత్వాన్ని గుర్తు చేసింది. కార్పొరేట్ కంపెనీల్ని కళ్లముందు నిలిపింది. 
తన ఇంటి ముందు కట్టేసి ఉండే బర్రెని ఇలా వర్ణిస్తాడు బలరాం. 'మా ఇంట్లో అందరికంటే బలిసి ఉండే ప్రాణి అది. దాని శరీరం నున్నగా మెరిసిపోతూ ఉంటుంది. ఎల్లవేళలా అది ఏ పనీలేకుండా ఇంటి ముందు కూర్చుని ఉంటుంది. దాన్ని బలంగా ఉంచడమే... అన్ని ఇళ్లల్లోని ఆడవాళ్ల అందరి లక్ష్యం అన్నట్టు పనిచేస్తారు. అదేమైనా దయతలచి కాస్త ఎక్కువ పాలు ఇస్తే... అమ్ముకోవచ్చని ఆశ.'

కోళ్ల గూడు...
భారతదేశంలో పేదరికాన్ని, బానిస బతుకుల్ని కోళ్లగూడుతో పోలుస్తాడు బలరాం. 'చికెన్ షాపులో కోళ్ల గూడుని ఎప్పుడైనా చూశారా..? ఒక పక్క తమ సోదర కోళ్లని నరుకుతూ ఉన్నా... గూడులోని కోళ్లలో ఎలాంటి చలనం ఉండదు. తర్వాత వంతు తమదే అన్న స్పృహే వాటికి ఉండదు. గూడు బద్దలు కొట్టుకుని బయటపడటానికి అవి ఎలాంటి ప్రయత్నం చేయవు.'

నవలలో మరోచోట బలరాం అంటాడు... 'ఈ కోళ్లగూడుని నియంత్రించడానికి వాటి యజమాని ఎలాంటి ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన పనిలేదు. అది లోపల్నించే నియంత్రించబడుతుంది. బానిసత్వంలో బతికే జనాలే... మరొకడు అందులోంచి బయటపడకుండా చూసుకుంటుంటారు.'

ల‌క్ష్మ‌ణ్‌గ‌ఢ్‌ని చీక‌టితో.. బెంగ‌ళూరుని వెలుతురుతో పోలుస్తాడు అర‌వింద్ ఆడిగ‌. న‌వ‌ల మొద‌ట్లోనే ఈ దేశం త‌న‌లో త‌నే రెండు దేశాలుగా ఉంద‌ని చెప్తాడు. స‌ముద్రం ఈ దేశానికి వెలుతురు తెస్తుంటే... న‌ది చీక‌టిని మోసుకొస్తోంది అంటాడు. ఈ దేశంలో స‌ముద్రంతో సంబంధ‌మున్న ప్రాంత‌మంతా వెలుతురు నిండి ఉంది. కానీ జీవ‌న‌ది గంగ‌ పారే చోట చీక‌టి నిండి ఉంది అంటాడు.

నవల సారాంశం అంతా తనే రెండు వాక్యాల్లో చెప్తాడు. 
'i was looking for the key for years
but the door was always open'

(ఇంగ్లీషులో ఏకబిగిన చదివిన మొట్టమొదటి నవల. ఇంగ్లీష్ అర్ధం చేసుకోవడం కొంచెం బెటర్ అయినట్టే అనిపిస్తోంది.)

1 comment: